రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన
మరట్వాడా: మహరాష్ట్రాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిచనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారు నిమిత్తం బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయిదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. 17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.