ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (ఇలాకా) నవంబర్ 6: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంపుతో పాటు విద్యా వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి రోజున 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం. చదువుతో పాటు నైపుణ్యత ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేస్తున్నట్లు చెప్పారు.
క్రీడల పట్ల కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.