మార్చి 1న లక్ష కొత్త రేషన్ కార్డులు!

Spread the love

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఇలాకా): పదేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 1 న లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే రోజు లక్ష రేషన్ కార్గుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్గులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. మిగిలిన జిల్లాల్లో మార్చి 8 తరువాత అందించనున్నారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.